వ్యాపారం
గత వారం రోజులుగా అన్ని దినపత్రికలను, టీవీ చానెళ్లను పూనకం పట్టినట్టుగా పట్టేసింది క్రికెట్. వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు భారత, పాకిస్తాన్ జట్టులు చేరాయో లేదో దీనిని ఎలాగైనా వ్యాపార వస్తువుగా మార్చాలనుకుని మీడియా భావించింది. దీనికి పూర్తి వత్తాసు కార్పొరేట్ ప్రపంచం నుంఇ లభించింది. ప్రజల వినియోగదారీ మనస్తత్వంపైనే మనుగడ సాగిస్తున్న మన మార్కెట్ శక్తులకు మీడియా తోడైతే ఇక చెప్పేదేముంది. ఇదీ అదీ అని తేడాలేకుండా అన్ని పత్రికలు, టీవీ చానెళ్లు గత వారం రోజులుగా విజయవంతంగా క్రికెట్ ను అమ్ముకోగలిగాయి. వైద్యులు శస్త్రచికిత్స చేసేముందర రోగికి నొప్పి తెలియకుండా మత్తుమందు ఇస్తారు. మీడియా తవ విష స్వభావానికి మనకు ఎలాంటి మనోవికారాలు కలగకుండా దీనికి దేశభక్తి అనే తారు పూసింది. ఈ వారం రోజులూ క్రికెట్టు గురించి మాట్లాడలేదంటే నువ్వు దేశభక్తుడివి కానట్టే. దీనికి చాలా విచిత్రంగా మన ప్రభుత్వం కూడా వంత పాడింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో అత్యంత విషాదభరితమైన అంశం ఇదే. భారత ప్రధాని మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగాన్ని క్రికెట్ వీక్షించడానికి రమ్మని స్వాగతించడంలోనే చాలా విచిత్రమైన మెలిక వుంది. కార్పొరేట్ స్వామ్యానికి మన ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయనడానికి ఇదే తిరుగులేని నిదర్శనం.
గత వారం రోజులుగా దేశ ప్రజలందరూ భారత, పాకిస్తాన్ క్రికెట్ గురించే మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి వార్తలు, విశ్లేషణలు పత్రికలు వండి వడ్డించాయి. మీరు దేని గురించి మాట్లాడాలో వారే ముందుగా నిర్ణయిస్తారు. మీరు జస్ట్.. అవి చదివేయడం.. మీ మిత్ర బ్రందం ముందర అవే వల్లె వేయడం. మీ మిత్ర బ్రుందంలోని సభ్యులు వారు చదివిన పత్రికలనుంచి విషయాలు చెప్పడం. మీరంతా చివర్లో మేరా భారత్ మహాన్.. అని జబ్బలు చరుచుకోవడం… అన్ని క్రీడల్లాగే క్రికెట్ కూడా కేవలం ఒక క్రీడ. దానికి ఎలాంటి ప్రాముఖ్యం ఇవ్వనక్కరలేదు. మన జీవితాలతో సంబంధం లేని క్రికెట్ ఆరోగ్యాన్ని ఏ మాత్రం పెంపొందించలేని ఒక నిరుపయోగ క్రీడ. నిజానికి అభివ్రుద్ధి చెందిన దేశాలేవీ ఆడని క్రీడ. ఇంగ్లండు మినహా మరే ఇతర అభివ్రుద్ధి చెందిన దేశంలోనూ ఈ క్రీడకు స్థానం లేదు. దీనివల్ల రోజుల తరబడి పని గంటలు వ్రుధా కావడం మాత్రమే కాకుండా, కొన్ని వేల మందిని ఏ పనీపాటా లేకుండా రోజు గడపనివ్వడం వల్లనే ఆయా దేశాల్లో ఈ క్రీడకు చోటు లేకపోయింది. కాని, గొప్పలకు పోయే దేశాలకు మాత్రం అన్నిటికంటే కాలమే విలువలేనిది. కొన్నిపదులమంది మైదానంలో ఏ మాత్రం బుఱకు పదునుపెట్టని, మనో శారీరక వికాసాలు కలగని ఆట ఆడుతుంటే, కొన్ని వందల మంది అంతే సోమరితనంగా నీడలొ చూస్తూ గడిపేస్తుంటే, కొన్ని వేల మంది అలాంటి పనికిమాలిన క్రీడా విశేషాల గురించి చదువుకుంటూ, మాట్లాడుకుంటూ, విశ్లేషించుకుంటూ గడపడం ఏవిధంగా దేశానికి ప్రయోజనకరమని చెప్పగలం?
చాలా విచిత్రంగా ఇన్ని కోట్లమంది సమయాన్ని వ్రుధా చేస్తున్న ఈ క్రీడ చేతివేళ్లకు మించని కొద్దిమంది క్రీడాకారులకు మాత్రం కోట్లకొద్దీ కాసులు కురిపించడం మనం మర్చిపోకూడదు. మన ఇంట్లో ఒక బాబో పాపో పదో తరగతి పరీక్ష రెండు సార్లు తప్పితే మనమెంతో నగుబాటుకు గురవుతాము. బంధువులకు ఏమని సమాధానం చెప్పుకోవాలో తెలియక సతమతమవుతాం. ఎలాంటి మినహాయింపులు లేకుండా మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్ క్రీడాకారులందరూ పదో తరగతి పరీక్షల్లో మూడు సార్లకు మించి తప్పినవారే. కానీ మైదానంలో వారు తొడుక్కున్న దుస్తుల దగ్గరనుంచీ, పెట్టుకున్న టోపీ, వాడుతున్న బ్యాట్ వంటి పరికరాలు, తాగుతున్న పానీయాల దగ్గరనుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ రాష్తపతి కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే ఇందులో ఏదో మతలబు వున్నట్టే. ఇక మన దేశంలో క్రికెట్ బోర్డులయితే అవినీతి కూపాలని ప్రతి దర్యాప్తు సంస్థా తేల్చిచెప్పింది. జనజీవితంతో సంబంధం లేని క్రికెట్ కేవలం మార్కెట్ కు మాత్రమే బంధువు. చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకునే చందంగా క్రికెట్ క్రీడాకారులతో ప్రకటనలు ఇప్పించి వారి వస్తువులను అమ్ముకునేట్టు చేయగలగడం మార్కెట్ లక్ష్యం. జనహితం పట్టని మార్కెట్ చెప్పుచేతల్లోకి వెళ్లిన మీడియా సైతం అదే లక్ష్యంతో పని చేస్తున్నప్పుడు విజ్నులైన ప్రజలు ఈ మాయాజాలానికి లొంగిపోకూడదు.
క్రికెట్ మైదానంలో కూర్చుని చూడడానికి వేలాది రూపాయలు పోసి టిక్కెట్లు కొనడం, వాటిని మరింత ధర పెట్టి బ్లాకులో కొనడం దారుణం. ఇక ఫలానా దేశం గెలుస్తుందని గర్వంతో కట్టే బెట్టింగులు సైతం కోట్లాది రూపాయలకు చేరుతున్నాయని సమాచారం. ఇది మరింత క్రూరమైన, ప్రమాదకరమైన క్రీడ. నిన్నటి వరల్డ్ కప్ సెమి ఫైనల్ లో మనమందరమూ చూడని విషాదమేమిటంటే రెండు దేశాల మధ్య జరిగిన క్రీడను పోటీ తత్వంతో గాక, రెండు శత్రి దేశాల మధ్య జరిగిన యుద్ధంగా చిత్రించడమ్. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ ఈ క్రీడను నిర్వహించడం మనం గుర్తించాలి. నిన్న ఒక్కరోజే మొబైల్ సంక్షిప్త సందేశాలతోనే కొన్ని కోట్ల రూపాయల వరకూ జరిగిన వ్యాపారంలో దేశభక్తి మురికికాలవ లోని బురదలాగా సెల్ ఫోన్లలో పారింది. ఓడిపోవడం, గెలవడం రెండూ ఏమంత విషయాలు కావని, కేవలం ప్రతిభావంతంగా ఆడడమే చాలా ముఖ్యమని మన క్రికెట్ పూనకం పట్టినవారికి చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశం.