మన ప్రపంచం – ౨౨
గాడ్ మెన్
వార్తాపత్రికలన్నీ పేజీలను సాయిబాబా కథనాలతో నింపేస్తున్నాయి. కడపలో ఎన్నికల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇప్పుడిలా సాయిబాబా మన పత్రికలకు ఉపయోగపడ్డారు. దాదాపు పద్దెనిమిదేళ్ల కిందట ఇదే సాయిబాబాపై హత్యాప్రయత్నం జరిగినప్పుడు ఆయన లుంగీ పైకెత్తి మేడమీది గదిలోకి పరిగెత్తినట్టు రాసిన ‘ఈనాడు’ ఇప్పుడు కేవలం ఆయన భక్తులకు చేరువవడానికి పేజీలకు పేజీలు కథనాలు వండివార్చుతోంది. సాయిబాబాపై కాకుండా చిల్లర బాబాలపై పదునైన మాటల తూటాలతో విరుచుకుపడే టీవీ నైన్ అకస్మాత్తుగా గత వారం రోజులుగా కాషాయరంగు ధరించింది. ఇలా వీలైనప్పుడల్లా మన మీడియా ఎంత దిగజారుడు తనానికైనా సిద్ధమని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటుంది. ఒక స్టాండు అంటూ లేకుండా ఎటుపడితే అటు నాలుకను తిప్పే ఊసరవెల్లి వ్యవహారం పత్రిక స్వప్రయోజనాలు కాపాడడం వరకూ ఏమోగాని, సమాజం నిలబడడానికి గాని, స్వయంగా ఎదగడానికి గాని ఏమాత్రం ఉపయోగపడదు.